* జావలిన్త్రోలో స్వర్ణపతకం సాధించిన నవీన్
* చెముడులంకలో సంబరాలు
UPDATED 29th JULY 2017 SATURDAY 9:00 PM
ఆలమూరు: శ్రీలంక రాజధాని కొలంబోలో గత మూడు రోజులుగా జరుగుతున్న అండర్ 25 ఒలింపిక్స్ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం చెముడులంక గ్రామానికి చెందిన నాగిరెడ్డి నవీన్ స్వర్ణపతకం సాధించాడు. సుమారు 20 దేశాల విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో జావలిన్త్రో విభాగంలో విజయం సాధించి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. ఆరు నెలల కింద గుజరాత్ రాష్ట్రం బరోడాలో జరిగిన జాతీయ స్థాయి పోటీలలో స్వర్ణపతకాన్ని సాధించి ఈ పోటీలకు అర్హత సాధించాడు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలోని స్వర్ణాంధ్ర కళాశాలలో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న నవీన్ నర్సరీ నుంచి 10వ తరగతి వరకూ చెముడులంక షిర్డీసాయిలో చదివాడు. అంతర్జాతీయ స్థాయిలో స్వర్ణపతకం అందుకోవటంతో ఆయన స్వగ్రామం చెముడులంకలో సంబరాలు జరుపుకున్నారు.







