UPDATED 6th MARCH 2026 9:00 AM
* 2018 మండపేట ఏసీబీ కేసులో ముదురుతున్న ఉచ్చు
* శాఖాపరమైన చర్యలకు ఉన్నతాధికారుల వద్ద ఫైల్ పెండింగ్
* ఉన్నతాధికారుల నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి
* సుదీర్ఘ కాలం తర్వాత కొలిక్కి వస్తున్న అవినీతి కేసు
పెద్దాపురం, రెడ్ బీ న్యూస్, మార్చి 6 : పెద్దాపురం తహశీల్దార్ సీహెచ్. వెంకటలక్ష్మిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు రంగం సిద్ధం చేశారు. గతంలో ఆమెపై నమోదైన ఏసీబీ కేసు పూర్వాపరాలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు చేపట్టేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ ప్రస్తుతం ఉన్నతాధికారుల వద్ద పెండింగ్లో ఉన్నట్లు సమాచారం.
నేపథ్యం ఇదే..
సదరు అధికారిణి 2018లో మండపేట తహశీల్దార్గా పనిచేస్తున్న సమయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు. వ్యవసాయ భూమి మ్యూటేషన్ నిమిత్తం లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి చిక్కిన ఈమెపై అప్పట్లో కేసు నమోదైంది. సుదీర్ఘ కాలంగా ఈ కేసు విచారణ సాగుతుండగా, తాజాగా ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఉత్కంఠ రేపుతున్న 'యాక్షన్'
ఏసీబీ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న తహశీల్దార్పై ప్రభుత్వం ఏ తరహా చర్యలు తీసుకోబోతుందనేది ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.







