UPDATED 11th SEPTEMBER 2018 TUESDAY 9:00 PM
గండేపల్లి: నిరంతర కృషి, పట్టుదలతో విద్యార్థులు ఏ రంగంలో అయినా విజయం సాధించవచ్చని ప్రముఖ మానసిక వైద్యురాలు డాక్టర్ నివేదిత వాసిరెడ్డి అన్నారు. జాతీయ ఆత్మహత్యల నివారణా దినోత్సవం పురస్కరించుకొని గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ గ్రంధాలయ సిబ్బంది ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ మానసిక వైద్యురాలు, రంగరాయ వైద్యకళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నివేదితా వాసిరెడ్డి పాల్గొని మాట్లాడారు. పరీక్షలలో విఫలమయ్యామనో, తల్లిదండ్రులు తిట్టారని చిన్న చిన్న కారణాలతో ఎంతో విలువైన జీవితాన్ని విద్యార్థులు అర్ధాంతరంగా ఆత్మహత్యలకు పాల్పడడం తగదని అన్నారు. స్వామి వివేకానందుని మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకొంటే యువత నిరంతర కృషి, వజ్ర సంకల్పంతో ఏదైనా సాధించగలమనే చిత్తం కలిగి ఉండాలని అన్నారు. నేటి యువత మానసిక దృఢత్వం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 14 సెకన్లకు ఒక ఆత్మహత్య జరుగుతుందని, ఇందులో 15-29 వయస్సు గల యువత ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. అనంతరం నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విజేతలకు ముఖ్య అతిధి చేతుల మీదుగా ప్రశంసాపత్రం, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. రమాశ్రీ, గ్రంధాలయ అధికారులు పాల్గొన్నారు.







