UPDATED 20th JULY 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరి క్షమార్హనీయం కాదని జై భరత్ నేషనల్ పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ గోరకపూడి చిన్నయ్యదొర అన్నారు. శుక్రవారం నిర్వహించిన స్థానిక విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఏకపక్ష విధానాల వల్లే సామాన్య, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, చివరకు బ్యాంకులు కూడా విశ్వసనీయతను కోల్పోయాయని చెప్పారు. తెలుగువారికి నమ్మకద్రోహం చేసిన కేంద్ర ప్రభుత్వానికి గతంలో కాంగ్రెస్కు పట్టిన గతే పడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా తెలుగు వారి ఆత్మగౌరవమే పునాదిగా జాతీయస్థాయిలో జైభారత్ నేషనల్ పార్టీని స్థాపించడం జరిగిందని, న్యాయబద్ధమైన హక్కులు సాధించుకునేందుకు ప్రజలంతా సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని అంశాలను నెరవేరుస్తామని, ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని వాగ్ధానాలు చేసి ఏఒక్క అంశాన్ని పూర్తిగా నెరవేర్చకుండా కక్షపూరితంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అడ్డగోలుగా జరిగిన విభజనతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని దానిని సాధించే వరకు పోరాటం చేయాలని, ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం తర్వాత వాటిని విస్మరించిందన్నారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా నిలిచిన వారందరినీ తమ పార్టీ తరఫున ప్రత్యేకంగా కలుస్తామని, తెలుగువారికి బాసటగా నిలిచినందుకు అభినందనలు తెలపడమే కాకుండా, తృతీయ ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సామర్లకోట పట్టణ పార్టీ అధ్యక్షుడుగా కె. ఫణింద్రను నియమించారు.







