ఆందోళన విరమించేది లేదు: జిల్లా కమిటీ అధ్యక్షురాలు రమణమ్మ

గంగవరం (రెడ్ బీ న్యూస్) 27  డిసెంబర్ 2021: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏటిపల్లి ఆశ కార్యకర్త చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కళింకోట రమణమ్మ హెచ్చరించారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలంటూ సీఐటీయూ, ఏపీ ఆశ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారానికి 14 వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాన్ని దేవీపట్నం, నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో గల ఆశా కార్యకర్తలు సందర్శించి తమ మద్దతును తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు రమణమ్మ, జిల్లా నాయకురాలు కొమరం చెల్లయమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశ కార్యకర్తల పట్ల సవతి ప్రేమ చూపుతుందని అని విమర్శించారు. రూ. 10 వేల  గౌరవ వేతనం ఇస్తున్నామని ప్రకటించి ఆర్థికంగా వెనుకబడి ఉన్నా ఆశా కార్యకర్తలకు కనీసం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కూడా నోచుకోవడం లేదన్నారు. ఆశా కార్యకర్తలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తమ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో గంగవరం పీహెచ్సీ పరిధిలో మాత్రం వైద్య అధికారులు ఆందోళన కార్యక్రమాలకు వెళ్లడానికి వీల్లేదని వెళితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తూ తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని వారు ఆరోపించారు. గత 14 రోజులు గా పి.హెచ్.సి ముందు రిలే నిరాహార దీక్ష చేస్తున్నా కనీసం వైద్యాధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు. గత నెల రోజులుగా పీహెచ్సీ పరిధిలో విధులు బహిష్కరించి ఆశా కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న డివిజన్ స్థాయిల్లోని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు అని వారు ప్రశ్నించారు. ఉన్నతాధికారుల ధోరణి చూస్తుంటే గిరిజనుల ఆరోగ్యంపై వారికి ఉన్న శ్రద్ధ తెలుస్తుందని, నిరంకుశ ధోరణితో పని చేస్తున్న గంగవరం మెడికల్ ఆఫీసర్లను బదిలీ చేసి చిన్నారి కుటుంబానికి న్యాయం చేసి వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, లేని పక్షంలో జనవరి మొదటి వారంలో ఏజెన్సీ 18 పీహెచ్సీల పరిధిలోగల ఆశా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా నాయకుడు తీగల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us