UPDATED 30th JULY 2019 TUESDAY 9:00 PM
పెద్దాపురం: మానవ అక్రమ రవాణాను అరికట్టడం ప్రతీ ఒక్కరి సామాజిక బాధ్యతని డిఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దాపురం పట్టణంలో గల సిటిజెన్ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో టాక్సీ, ఆటో డ్రైవర్లతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రాన్ని మానవ అక్రమ రవాణా రహితంగా తీర్చిదిద్దేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని అన్నారు. నేడు మహిళలతోపాటు, పురుషులు కూడా అక్రమ రవాణాకు గురవుతున్నారని, శరీరంలోని అవయవాలనూ అక్రమంగా రవాణా చేస్తున్నారని, దీనిపై ప్రజల్లో చైతన్యం రావాలని సూచించారు. చిన్నపిల్లలు ఎక్కడైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీపంలోని పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో పనిచేయడం ద్వారా మానవుల అక్రమ రవాణాను అరికట్టవచ్చన్నారు. అనంతరం పట్టణంలోని పలు వీధులగుండా ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ వి. శ్రీనివాసరావు, ఎస్ఐ వెలుగుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.







