దుంప సాగులో విత్తన ఎంపికే కీలకం : హెచ్.ఆర్.ఎస్ శాస్త్రవేత్త డాక్టర్ జానకి

పెద్దాపురం: 4 జూన్ 2020 (రెడ్ బీ న్యూస్): కర్రపెండలం సాగులో విత్తన ఎంపికే కీలకమని హార్టీకల్చరల్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. జానకి అన్నారు. స్థానిక దుంప పరిశోధనా కేంద్రంలో రైతులకు గురువారం దుంప విత్తన కర్రను అందచేసే కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దుంప పంట ఉష్ణ మండల పంట కావడంతో అధిక తేమ, ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలమని, అలాగే నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుందని అన్నారు. పూర్తిగా వర్షాధార పంట కావడం, జూన్, జూలై నెలలు, అలాగే నీటిపారుదల ఉన్న అన్ని నేలల్లో నాటుకోవచ్చని అన్నారు. మేలైన విత్తన రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని, ముఖ్యంగా రైతులు అధిక దిగుబడులు సాధించే విధంగా వారికి కావాల్సిన సూచనలు, సలహాలను అందించడం జరుగుతున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా పీడీపీ సీఎంఆర్ - 1. శ్రీరక్షా - 1, శ్రీ రక్ష -2 విత్తన రకాలను రైతులకు ఆమె అందచేశారు. నారుమడి విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని సూచన చేశారు. దుంప ముచ్చెలను లీటరు నీటికి రెండు మిల్లీలీటర్లు డైమిథోయేట్ మూడు గ్రాముల మాంకోజెట్ కలిపిన ద్రావణంలో ఐదు నిముషాలు ముంచాలని, ఆముచ్చెలు నారుమళ్లలో దగ్గరగా వేసుకోవాలని రైతులకు సూచించారు. అలాగే తెగుళ్ల విషయానికి వస్తే దుంప పంటకు మొజాయిక్, ఎర్ర నల్లి (రెడ్ మైట్) తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుందని, ఈ తెగుళ్లతో సుమారు 40 నుంచి 80 శాతం మేర దిగుబడి తగ్గుతుందని పేర్కొన్నారు. మొజాయిక్ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుందని, ముఖ్యంగా ఆకుల్లో పత్రహరిత శాతం కుచించుకుపోవడం జరుగుతుందన్నారు. దీని నివారణకు క్లోరోఫైరీఫాస్ రెండు మిల్లీలీటర్ల మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ ఏ. పావని తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us