Updated 6th December 2022 9:25 pm
PM Modi Chit Chat: ప్రధానమంత్రి నరేంద్రమోదీ రేపు మీడియాతో చిట్ చాట్ నిర్వహించనున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియా ప్రతినిధులతో మోదీ ముచ్చటించే అవకాశం ఉందని పార్లమెంట్ సెక్రటరీ తెలిపారు. సహజంగానే పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని మీడియాతో మాట్లాడటం ఆనవాయితీ. అందులో భాగంగానే బుధవారం మీడియాతో మోదీ కాసేపు మాట్లాడనున్నారు.
డిసెంబర్ 7 నుంచి 29 వరకు జరిగే పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం కొత్తగా 16 బిల్లులను ప్రవేశ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాజ్యాంగ సంస్థలను మోదీ ప్రభుత్వం బలహీనం చేస్తోందని ఆరోపిస్తోన్న కాంగ్రెస్.. దేశ ఆర్థిక పరిస్థితి, ధరల పెరుగుదల, చైనా సరిహద్దులో ప్రతిష్టంభన వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమవుతోంది. మహిళా రిజర్వేషన్ బిల్లు, జనాభా నియంత్రణ బిల్లు వంటి అంశాలు కూడా నేటి అఖిలపక్ష సమావేశంలో చర్చకు వచ్చాయి.
పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి సభ్యుల ప్రవర్తనా నియమావళిని రాజ్యసభ సెక్రటేరియట్ మంగళవారం విడుదల చేసింది. లోక్సభ ఇంటర్ సెషన్లో మరణించిన సభ్యులకు మొదటి రోజు నివాళులర్పించనుంది. ఇటీవల సమాజ్ వాది పార్టీ అధినతే ములాయం సింగ్ యాదవ్ మరణించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ చైర్మన్గా ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ అధ్యక్షతన జరగనున్న తొలిసెషన్ ఇందుకు వేదిక కానుంది. భారత్ జోడో యాత్రలో ఉన్నందున ఈ సమావేశాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరు కాకపోవచ్చని తెలుస్తోంది.







