UPDATED 8th OCTOBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి చంద్రదాస్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల చేపట్టిన దీక్షలకు సోమవారం సిపిఐ పట్టణ పార్టీ మద్దతు తెలియచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మున్సిపల్ కార్మికుల సమ్మె సోమవారానికి ఐదో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిపిఐ మాజీ కౌన్సిలర్ ఎలిశెట్టి రామదాసు మాట్లాడుతూ సుప్రీంకోర్టు 151 జీవో ద్వారా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కనీస వేతనం రూ.18వేలు ఇవ్వాలని సూచించిందన్నారు. ప్రభుత్వాలు దీనిని అమలు చేయలేదన్నారు. కార్మికుల కడుపు కొట్టే 279 జీవోను ప్రభుత్వం తెచ్చి, వారి హక్కులను కాలరాసే పనికి పూనుకుందన్నారు. కాంట్రాక్టు కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. 151 జీవో అమలు, ఇఎస్ఐ, ఇపిఎఫ్ కార్మికుల ఖాతాలో జమ చేయాలన్నారు. 279 జీవో రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సింహాచలం, ఎఐటియుసి నగర కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, శీరంశెట్టి వెంకటేష్, పైడిరాజు, అల్లం రత్నం, ఇండిగిపల్లి సురేష్, సింగంపల్లి అనసూయ, మల్లవరపు శకుంతల, తదితరులు పాల్గొన్నారు.







