UPDATED 20st JANUARY 2019 SUNDAY 10:00 PM
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలో ప్రసిద్ధి గాంచిన హజరత్ మదీనా పాచ్ఛా ఔలియా ఉరుష్ షరీఫ్ గంధోత్సవ సంబరం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దర్గాను రంగు రంగుల విద్యుత్తు దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరై ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ దర్గాలో సుమారు రూ. తొమ్మిది లక్షలతో అధునాతనమైన షెడ్ ఏర్పాటు చేశామన్నారు. నియోజకవర్గంలో షాదీ ఖానాలు, దర్గాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ముస్లిం మహిళల వివాహం నిమిత్తం రూ.50 వేలు ఆర్థిక సహకారం ప్రభుత్వం అందజేస్తుందన్నారు. ప్రతీ సంవత్సరం హిందూ, ముస్లిం, క్రైస్తవ ఐక్యతతో నిర్వహిస్తున్న ఈ దర్గా ఉత్సవం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ గంధోత్సవాన్ని అధిక సంఖ్యలో భక్తులు హాజరై కన్నులపండువగా తిలకించి తరించారు. దర్గా మొత్తం అల్లా నామ స్మరణతో హోరెత్తింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ ఛైర్మన్ కొరిపూరి రాజు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ బొడ్డు బంగారుబాబు, దర్గా కమిటీ అధ్యక్షుడు ఎంఎల్ ఆలీ, ఆత్మ ఛైర్మన్ కలకపల్లి రాంబాబు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, ఆరిఫ్ ఆలీ, ఇర్షాద్ ఆలీ, బాబూలాల్, ఆషిక్, రఫీ, బాబ్జి, రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.







