UPDATED 19th DECEMBER 2018 WEDNESDAY 7:00 PM
పెద్దాపురం: పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు రూ.వెయ్యి కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు ఆధ్వర్యంలో పట్టణ పరిధిలో స్థానిక బంగారమ్మ గుడి వీధి 21,22 వార్డుల్లో బుధవారం నిర్వహించిన నగరదర్శిని- నగర వికాసం కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ గత నాలుగున్నర సంవత్సరాల్లో పట్టణంలో ప్రధాన సమస్యలు పరిష్కరించడం జరిగిందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల అవసరాలను తీర్చడంలో ముందుంటారని అన్నారు. ఈ పాదయాత్రలో మంత్రికి ప్రజలు కర్పూర హారతులు ఇచ్చి బ్రహ్మరధం పట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, వార్డు కౌన్సిలర్ గెడ్డం పెదకాపు, టిడిపి పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రంధి సత్యనారాయణ, తూతిక రాజు, ఆత్మ చైర్మన్ కలకపల్లి రాంబాబు, మున్సిపా కమీషనర్ బి.ఆర్. శేషాద్రి, మేనేజర్ ప్రసాద్, విజ్జపు రాజశేఖర్, బేదంపూడి సత్తిబాబు, ఆకుల కృష్ణ బాపూజీ, కందుల కుమార్, ఉల్లి మంగ, తదితరులు పాల్గొన్నారు







