UPDATED 11th NOVEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: విద్య ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమని, అందరికీ ఒకే రకమైన విద్యను ప్రసాదించే ఉమ్మడి విద్యావ్యవస్థను నిర్మించడం ద్వారానే శాంతి, న్యాయం, స్వేచ్ఛ అని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ పేర్కొన్నారు. స్థానిక బచ్చు పౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరామకృష్ణ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయుడని, క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహంలో ఆయన పోరాడారని, విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మైనార్టీల సంక్షేమానికి విశేష కృషి చేశారన్నారు. భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జన్మదినాన్ని జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నామని, అలాంటి మహనీయుల అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాల స్థాపనకు, ప్రాథమిక, మాథ్యమిక, సాంకేతిక విద్యాభివృద్ధికి ఆయన వేసిన బాటలు మరువలేనివన్నారు. స్వతంత్ర భారతావని తొలి విద్యాశాఖా మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓపెన్ స్కూల్ ఫ్యాకల్టీ కె. శివప్రసాద్, శ్రీనివాస్, వి. అచ్చిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







