UPDATED 14th JULY 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: మొక్కలే ప్రకృతికి జీవనాధారమని, వాటిని నాటి సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ రోడ్డులో సామర్లకోట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వనం-మనం కార్యక్రమంలో శనివారం మంత్రి చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని మొక్కలు నాటి మాట్లాడారు. రాష్ట్రంలో 26 శాతంగా ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 2029 నాటికి 50 శాతానికి పెంచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. మానవుడి ఉనికికి ప్రధాన కారణమైన ప్రకృతిని ప్రేమించినపుడే మనుగడ సాధ్యమవుతుందని, ప్రతీ శుభకార్యంలో ఒక మొక్క నాటే సంప్రదాయం ఇప్పటి నుంచి మొదలుపెట్టాలని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ పాఠశాల వద్ద మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు బీమా పథకాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరరావు, డిఇ ప్రభాకరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, కంటే జగదీష్ మోహన్, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, బడుగు శ్రీకాంత్, మెప్మా సిబ్బంది వెంకటలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.







