UPDATED 21st MARCH 2019 THURSDAY 10:00 PM
పెద్దాపురం: ఈ నెల 22వ తేదీన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎన్నికలు దృష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం ర్యాలీలు, ఊరేగింపులు పూర్తిగా నిషేధమని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు, డిఎస్పీ చిలకా వెంకట రామారావు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం నిర్వహించిన సమావేశంలో స్థానిక విలేఖరులతో వారు మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల నామినేషన్లు దాఖలు చేసేందుకు రిటర్నింగు అధికారుల వద్దకు వచ్చే అభ్యర్థులు ఎవ్వరూ కూడా ర్యాలీలు, ఊరేగింపులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించరాదని అన్నారు. ఈ ఉత్తర్వులను పటిష్టంగా అమలు చేస్తామని, ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కె. గోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.







