Covid: ‘కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోండి’.. సూచించిన ప్రముఖ వైరాలజిస్ట్‌

ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: కరోనా వైరస్‌ కొత్త వేరియంట్లు, వేవ్‌లు పుట్టుకొస్తూనే ఉంటాయని.. వాటితో కలిసి జీవించడం నేర్చుకోవాలని భారత్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్ట్‌ డా.గగన్‌దీప్‌ కాంగ్‌ పేర్కొన్నారు. కొవిడ్‌ వేవ్‌లు మళ్లీమళ్లీ వస్తాయని హెచ్చరించారు. అయితే డెల్టా కంటే తాజా ఒమిక్రాన్‌ ప్రభావం తక్కువేనని తెలిపారు. ‘మనం సార్స్‌-కోవ్‌-2, దాని వేరియంట్లతో జీవించడం నేర్చుకోవాలి. ఇంకా అనేక వేరియంట్లు వస్తూనే ఉంటాయి. అదృష్టవశాత్తూ.. తాజా ఓమిక్రాన్ ఇతర వేరియంట్ల కంటే ప్రభావం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది’ అని గగన్‌దీప్‌ పేర్కొన్నారు. పిల్లలపై కొవిడ్‌ ప్రభావంపై తక్కువగానే ఉందని కాంగ్‌ తెలిపారు. వారిని పాఠశాలలకు పంపడమే ఉత్తమమని సూచించారు. ‘సాధారణంగా పిల్లల్లో కొవిడ్-19 ఇన్ఫెక్షన్ల తీవ్రత తక్కువగా ఉంటోంది. కాబట్టి వారిని పాఠశాలలకు పంపడమే ఉత్తమమని నేను అనుకుంటున్నా’ అని అన్నారు. అర్హులకు ప్రికాషన్ డోసు వేసేందుకు కేంద్రం అనుమతిచ్చిన నేపథ్యంలో.. ఇదివరకు తీసుకున్న డోసునే బూస్టర్ డోసుగా ఇస్తారా లేక ఇతర వ్యాక్సిన్‌ను ఇస్తారా అనే విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నారు. ఈ అంశంపైనా కాంగ్‌ మాట్లాడారు. మూడో డోసు ఇవ్వడంపై ఇంకా సరైనా డేటా లేదని తెలిపారు. ఇందుకు సంబంధించిన సమాచారం చాలా తక్కువగా ఉందన్నారు. దేశంలో కరోనా కేసులపై ఒమిక్రాన్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. కొవిడ్‌ తాజా కేసుల్లో అనూహ్య పెరుగుదలే ఇందుకు నిదర్శనం. గత కొన్ని రోజులుగా 10 వేలకు దిగువనే నమోదవుతున్న కేసులు.. తాజాగా 16 వేలకుపైగా చేరాయి. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. నిన్న ఒక్కరోజే 16,764 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య దాదాపు 1300కు చేరింది. ఒక్క రోజులోనే కొత్త వేరియంట్‌ కేసులు 30 శాతం మేర పెరిగాయి. వేగంగా విస్తరిస్తోన్న ఈ వేరియంట్.. 23 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. అత్యధికంగా మహారాష్ట్రలో నమోదవగా, ఆ తర్వాతి స్థానంలో దేశ రాజధాని దిల్లీ ఉంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us