UPDATED 29th MARCH 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: జనసేన పార్టీ బలం రోజురోజుకు పెరుగుతోంది. అన్ని వర్గాల ప్రజలు జనసేన పార్టీకి జేజేలు పలుకుతూ పార్టీలో చేరుతున్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థి తుమ్మల రామస్వామి (బాబు) తన ప్రచారంలో జోరుపెంచి కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక సంపెంగ తోట, నిమ్మతోట, కొత్తూరు వీధి, గోలివారి వీధి, శెట్టిబలిజపేటలలో ఎన్నికల ప్రచారం శుక్రవారం నిర్వహించారు. అడుగడుగునా మహిళలు హారతులిచ్చారు. అలాగే సత్యనారాయణ పురంలోని వ్యాన్ స్టాండ్ ఓనర్స్, డ్రైవర్లతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ మీకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అలాగే నాల్గవ వార్డులోని ముస్లిం నాయకులు ఆస్మీమహ్మద్, సలీం మహ్మద్ షఫీయుల్లా, సూరజ్, తదితరులు సుమారు 40మంది జనసేన పార్టీలో చేరారు. వారికి రామస్వామి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో జనసేన కార్యకర్తలతో పొత్తు పార్టీలు సీపీఐ, సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొని జనసేన పార్టీని గెలిపించి గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీలో జరుగుతున్న మార్పులు చూసి పలువురు ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు జనసైన్యంలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న జనసైనికులతో కలిసి తుమ్మల రామస్వామి (బాబు) సతీమణి తుమ్మల శ్రీదేవి మండల పరిధిలోని గ్రామాల్లో ప్రచారంలో దూసుకుపోతున్నారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని వర్గాల ప్రజలను కలుపుకునిపోతూ జన సంక్షేమ పాలనే లక్ష్యంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రూపొందించిన పార్టీ మ్యానిఫెస్టోను ప్రజల్లో విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల నాగబాబు, అంజి, సరోజ్ వాసు, ఉదయ్ కుమార్, పెంకే వెంకటలక్ష్మి, పిట్టా జానకి రామారావు, జట్ల మోహన్, వడ్డాది దుర్గాదేవి, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







