UPDATED 22 FEBRUARY 2022 TUESDAY 06:21 PM
Karnataka Bajrangdal: భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను హత్య చేసిన ఘటన కర్ణాటకలోని షిమోగా జిల్లాలో సంచలనంగా మారింది. దీంతో షిమోగా జిల్లా సహా మరికొన్ని సున్నిత ప్రాంతాల్లో విధించిన 144 సెక్షన్ ను మరో రెండ్రోజుల పాటు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంగళవారం ప్రకటించారు. ఈ క్రమంలో స్కూల్స్, విద్యా సంస్థలు మరో రెండ్రోజుల పాటు మూసే ఉంచుతారు.
ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేయగా, మరో 12మందిపై విచారణ జరుగుతుందని పోలీస్ అధికారులు వెల్లడించారు. అరెస్ట్ అయిన వారిని కశీఫ్, నదీమ్, ఆసిఫ్ రిహాన్ లుగా గుర్తించినట్లు ఇండియా టీవీ అనే ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుల ఆచూకీ తెలిసింది. షిమోగా జిల్లా వ్యాప్తంగా గాలించి పట్టుకున్నామని అడిషనల్ డీజీపీ ప్రతాప్ రెడ్డి వివరించారు.
‘హర్ష హత్య కేసుతో నగరమంతా అల్లర్లు చెలరేగాయి. షిమోగా జిల్లాలో అదనపు బలగాలను దించి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నాం. డిప్యూటీ కమిషనర్, ఎస్పీ భద్రతా ఏర్పాట్లు చూసుకుంటున్నారు. మరే దారుణం జరగకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని’ అడిషనల్ డీజీపీ తెలిపారు.
ఘటన వివరాలు: హర్ష (23) అనే భజరంగ్ దళ్ కార్యకర్తను ఆదివారం రాత్రి కొందరు దుండగులు వెంటాడి కత్తులతో దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న హర్షాను స్థానికులు సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హర్షా మృతి చెందాడు.
హత్య తర్వాత: సీగేహట్టి ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. స్థానిక భజరంగ్ నేతలు, ఇతర కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. రోడ్డుపై వాహనాలను తగలబెట్టి, దుకాణాలను మూసివేశారు. ఘటనపై సమాచారం అందుకున్న షిమోగా పోలీసులు అప్రమత్తమై సీగేహట్టి ఏరియాను ఆధీనంలోకి తీసుకుని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బలగాలను మోహరింపజేశారు. శివమొగ్గ జిల్లా సహా పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించి ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. ముందు జాగ్రత్త చర్యగా జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలను మూసివేసి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బందితో భద్రత కట్టుదిట్టం చేశారు.







