UPDATED 8th AUGUST 2017 TUESDAY 10:00 PM
కాకినాడ : అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన నాణ్యమైన ఉత్పత్తులను అపర్ణా టైల్స్ మార్కెట్లోకి విడుదల చేయనుంది. హైదరాబాద్ కు చెందిన అపర్ణ గ్రూప్ టైల్స్ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించింది. వచ్చే నెలాఖరుకల్లా వెటిరో టైల్స్ మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో 40 ఎకరాల విస్తీర్ణంలోనిర్మించిన తమ ఫ్యాక్టరీలో ఇప్పటికే టైల్స్ ఉత్పత్తి ప్రారంభమైందని డైరెక్టర్ డి.ఎస్.ప్రసాద్ తెలిపారు. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ఈ టైల్స్ ఫ్యాక్టరీని నిర్మించామని, బిల్డింగ్ కనస్ట్రక్షన్ మెటీరియల్, రెడీమిక్స్ కాంక్రీట్ తయారీలో అగ్రగామిగా ‘అపర్ణ’కు పేరుందని, ఇపుడు అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో టైల్స్ రంగంలోకి వచ్చామన్నారు. దక్షిణాదిలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలలో టైల్స్ వినియోగం ఎక్కువగా ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేశామన్నారు. ఈ రెండు రాష్ట్రాలలోనే 42 శాతం వినియోగం ఉందన్నారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిసా, ఛత్తీస్ గడ్, కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో 110 మంది డీలర్లను నియమించామన్నారు. లేటెస్ట్ డిజైన్లు, సైజులలో టైల్స్ తయారు చేస్తున్నామన్నారు. రోజుకు 15,000 చదరపు మీటర్ల టైల్స్ ఈ పరిశ్రమలో తయారవుతాయని, దక్షిణాదిలో భారీ టైల్స్ తయారీ కర్మాగారం తమదేనన్నారు. టైల్స్ తయారీకి నాణ్యమైన ముడి సరకు వినియోగిస్తామని చెప్పారు. దేశంలోనే అతి పెద్దదైన 265 మీటర్ల పొడవు బట్టీ ద్వారా కిల్న్శాక్మి ఇటలీ సాంకేతిక పరిజ్ఞానంతో టైల్స్ తయారీ చేపడుతున్నామన్నారు. దేశంలో 650 టైల్స్ ఫ్యాక్టరీలు ఉంటే అందులో 600 వరకు గుజరాత్లోనే ఉన్నట్టు అపర్ణ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ (టెక్నికల్) చంద్రశేఖర్ చెప్పారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్, మార్కెటింగ్) ఎ.కె.రవీంద్రన్ మాట్లాడుతూ నాలుగు రకాల సైజుల్లో టైల్స్ అందుబాటులోకి తెస్తున్నామని, వినియోగదారుల కోరిక మేరకు వారు కోరుకున్న సైజుల్లో రెండు రోజుల వ్యవధిలో టైల్స్ డిజైన్ చేసి అందిస్తామని వివరించారు. ఈ ప్లాంట్ ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్లో టైల్స్ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అత్యున్నత ప్రమాణాలతో టైల్స్ తయారు చేస్తున్న టాప్-10 కంపెనీల్లో చోటు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.







