UPDATED 8th DECEMBER 2019 SUNDAY 9:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డిసిసిబి) చైర్మన్గా అనంత సత్య ఉదయ భాస్కర్, డైరెక్టర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కాకినాడ సిటీ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి అధ్యక్షతన స్థానిక నాగమల్లితోటలో గల డిసిసిబి కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత చైర్మన్ ఉదయ భాస్కర్ కు డిసిసిబి ఉద్యోగులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం ఆయన డిసిసిబి ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల్లో ప్రతీ రూపాయిని సంరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సి, ఎస్టి, బిసి, మైనార్టీ వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పించి నామినేటెడ్ పోస్టులను కేటాయించడానికి చర్యలు చేపట్టి అమలు చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం ఉదయ భాస్కర్ ను డిసిసిబి ఛైర్మన్గా నియమించారని పేర్కొన్నారు. గతంలో డిసిసిబిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, వాటన్నిటినీ తొలగించి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని చైర్మన్కు ఆయన సూచించారు. కాకినాడ సిటీ ఎంఎల్ఎ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన తండ్రి బాటలో పయనిస్తూ అందరికీ సమన్యాయం చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ ఉదయభాస్కర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తనపై పెట్టిన నమ్మకాన్ని నిలుపుకుంటానని, డిసిసిబిని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. చైర్మన్ తో పాటు డిసిసిబి డైరెక్టర్లుగా ఇళ్ల సత్యగోపాలకృష్ణ, బండారు సత్తిరాజు, పోలిశెట్టి సోమరాజు, పంతం శ్రీదుర్గాభవాని, శెట్టిబత్తుల కుమార్రాజా, సయ్యద్ మొహిద్దీన్ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఎలు నాగులాపల్లి ధనలక్ష్మి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు, మాజీ మంత్రి కొప్పన మోహనరావు, నగర అధ్యక్షులు ఫ్రూటీకుమార్, తదితరులు పాల్గొన్నారు.







