* ప్రారంభమైన కార్తీక మాసం
UPDATED 8th NOVEMBER 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: శివకేశవులకు ప్రీతికరమైన పుణ్యప్రదమైన కార్తీకమాసం రానే వచ్చింది. దీపావళి వెలుగుల లక్ష్మిని ఆరాధిస్తూనే కార్తీకానికి ప్రజలు స్వాగతం పలికారు. కార్తీకమాసం పురస్కరించుకుని స్థానిక కుమారారామ భీమేశ్వరస్వామి వారి ఆలయానికి గురువారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని పవిత్ర గోదావరి పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈరోజు నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు నెల రోజులపాటు కార్తీకమాస ఉత్సవాలు జరుగుతాయని, ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరుగుతాయని దేవస్థానం కార్యనిర్వహణాధికారి పులి నారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు, వేద పండితులు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.







