UPDATED 3rd SEPTEMBER 2017 SUNDAY 9:00 PM
అన్నవరం : సత్యగిరిపై నిర్మిస్తున్న వేద పాఠశాల నిర్మాణంపై ధర్మకర్తల మండలి సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవస్థానం ఛైర్మన్ ఐ.వి.రోహిత్ అధ్యక్షతన ఆదివారం జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో సత్యగిరిపై నిర్మిస్తున్న వేద పాఠశాల నిర్మాణంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. కేవలం 30-40 మంది విద్యార్థులు కోసం రూ.10 కోట్లతో నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారని, ఎటువంటి భద్రతా లేకుండా కొండ ప్రాంతంలో నిర్మాణాలు చేస్తే ఏదైనా ఇబ్బంది కలిగితే బాధ్యత ఎవరిదని సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో సభ్యులకు, అర్కిటెక్ట్కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నిర్మాణం విషయంలో అంచనాలు పెంచుతూ దేవుని సొమ్ము వృథా చేస్తున్నారని, తక్షణం పనులు నిలపాలని, ఈ విషయమై దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ప్రథమ లక్ష్యంగా దేవస్థానం ధర్మకర్తల మండలిలో సభ్యులంతా చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో దేవస్థానం ఇన్ఛార్జి ఈవో ఈరంకి జగన్నాథరావు, సభ్యులు కందుల విశ్వేశ్వరరావు, మట్టే సత్యప్రసాద్, యడ్ల భేతాళుడు రావిపాటి సత్యనారాయణ, యనమల రాజేశ్వరరావు, అవసరాల వీర్రాజు, నున్న రామచంద్రరావు, సింగిలిదేవి సత్తిరాజు, రొబ్బి విజయశేఖర్, కొత్త వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.







