UPDATED 2nd JULY 2018 MONDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో వ్యవస్థాపకతపై సోమవారం సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబాయ్ కి చెందిన ప్రముఖ మేనేజ్ మెంట్ విభాగ నిపుణులు, బిట్స్ పిలానీ కళాశాల మేనేజ్ మెంట్ విభాగాధిపతి డాక్టర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఆధునిక పోటీ ప్రపంచంలో వ్యవస్థాపకత విభాగంలో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని, అలాగే వ్యవస్థాపకుడు వ్యాపార రంగాలలో రాణించాలంటే నిర్దిష్టమైన ప్రణాళికలు ఏర్పరచుకుంటే విజేతలుగా నిలుస్తారన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్రీనివాసరావు వ్యవస్థాపకత రంగంలో విశేష అనుభవం గడించి విద్యార్థులకు మార్గదర్శకులుగా దిశానిర్దేశం చేస్తూ ఎందరినో ఉన్నతస్థాయికి చేర్చిన గొప్ప మేధావని, సందర్భపరిశీలన, సమయపాలన, వృత్తినైపుణ్యత విలువలను పెంపొందించుకోవాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి తాము ఎంచుకొన్న మార్గంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.







