చైనా నుంచి కొనుగోలు చేసిన పాకిస్థాన్
ఇస్లామాబాద్ (రెడ్ బీ న్యూస్) 31 డిసెంబర్ 2021: అధునాతన రఫేల్ యుద్ధవిమానాలను భారత్ సమకూర్చుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ కూడా స్పందించింది. తన చిరకాల మిత్రదేశం చైనా నుంచి 25 బహుళ ప్రయోజన జె-10సి ఫైటర్ జెట్లను దిగుమతి చేసుకుంది. వచ్చే ఏడాది మార్చి 23న జరిగే జాతీయ దినోత్సవంలో వాటిని తొలిసారి ప్రదర్శిస్తామని పాక్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రషీద్ అహ్మద్ తెలిపారు. చైనా ఉత్పత్తి చేస్తున్న అత్యంత విశ్వసనీయ యుద్ధ విమానాల్లో జె-10సి కూడా ఒకటి. గత ఏడాది పాక్తో కలిసి డ్రాగన్ నిర్వహించిన సంయుక్త విన్యాసాల్లో ఈ జెట్లూ పాలుపంచుకున్నాయి. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతం.. అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న ఎఫ్-16 యుద్ధవిమానాలు ఉన్నాయి. అయితే 36 రఫేల్ జెట్ల కొనుగోలుకు ఫ్రాన్స్తో భారత్ ఐదేళ్ల కిందట ఒప్పందాన్ని కుదుర్చుకున్న నేపథ్యంలో తాను కూడా బహుళ ప్రయోజన, అన్నిరకాల వాతావరణాల్లో పనిచేసే పోరాట విమానాలను సమకూర్చుకోవాలని పాక్ తహతహలాడింది.







