UPDATED 11th APRIL 2022 MONDAY 02:30 PM
Gujarat : గుజరాత్ రాష్ట్రం బారుచ్ జిల్లాలో కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ పేలుడులో ఆరుగురు కార్మికులు మరణించారు. అహ్మదాబాద్ కు 235 కిలో మీటర్ల దూరంలోనే దహేజ్ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ యూనిట్ లో తెల్లవారు జామున 3గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ విషయాన్ని స్థానిక అధికారులు వెల్లడించారు. పేలుడు ధాటికి కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు.కార్మికులంతా పనిలో నిమగ్నమైన సమయంలో సాల్వెంట్ డిస్టిలేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా రియాక్టర్ పేలిపోయిందని బారుచ్ పోలీస్ సూపరింటెండెంట్ లీనా పాటిల్ తెలిపారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టంకు తరలించినట్లు తెలిపారు.
మంటలు కూడా అదుపులోకి వచ్చాయని బారుచ్ ఎస్పీ లీనా పాటిల్ వెల్లడించారు. అయితే ఈ పేలుడు ఘటనలో మరెవరికి గాయాలు కాలేదని అధికారి తెలిపారు.







