Assam Floods: అసోం వరదలు.. 127కు చేరిన మృతుల సంఖ్య

UPDATED 26th JUNE 2022 SUNDAY 08:50 PM

Assam Floods: అసోంలో ఇంకా వరద బీభత్సం కొనసాగుతోంది. గత ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు వదరల వల్ల రాష్ట్రంలో 127 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 28 జిల్లాల్లో వరద ప్రభావం కొనసాగుతోంది. ఇంకా 22 లక్షల మంది వరద ముంపు ప్రాంతాల్లోనే చిక్కుకున్నారు. రాష్ట్రంలోని పెద్ద పట్టణాల్లో ఒకటైన కాచర్ జిల్లా, సిల్చర్ పట్టణం ఇంకా వరద నీటిలోనే మునిగి ఉంది. ఈ నగరంలో ఇప్పటికీ ఐదు నుంచి ఎనిమిది అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి.

సిటీలోని రెండు లక్షల మంది ప్రజలు ఆహారం, తాగునీరు, ఇతర సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నగరం వరదలో మునిగి ఆదివారం నాటికి ఏడు రోజులవుతోంది. స్థానిక బరాక్ నది పొంగడం వల్ల సిల్చర్ పట్టణం నీట మునిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఐదుగురు మరణించారు.

ఇందులో ఒకరు మహిళ కాగా, మిగతా నలుగురు చిన్నారులు. దర్రాంగ్, దుబ్రి జిల్లాల్లో ఇద్దరు గల్లంతు కాగా, అధికారులు వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 680 సహాయక కేంద్రాలు కొనసాగుతుండగా, వాటిలో 2,17,413 మంది ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో లక్ష మందికిపైగా కచార్ జిల్లాలోనే ఉండటం గమనార్హం. మరోవైపు అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ సిల్చర్ పట్టణాన్ని ఏరియల్ సర్వే ద్వారా సందర్శించారు. వరద బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us