* సామాజిక కార్యకర్త గుణ్ణం లక్ష్మణరావు
* స్పందన కార్యక్రమంలో ఆర్డీవోకు ఫిర్యాదు
UPDATED 30th DECEMBER 2019 MONDAY 7:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): పెద్దాపురం పట్టణంలో అనధికార భవనాలు యథేచ్చగా నిర్మిస్తున్నారని, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ లే అవుట్లు వెలుస్తున్నాయని వాటిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త గుణ్ణం లక్ష్మణరావు స్పందన కార్యక్రమంలో సోమవారం ఆర్డీవో ఎస్. మల్లిబాబుకు ఫిర్యాదు చేశారు. అనంతరం లక్ష్మణరావు మాట్లాడుతూ పెద్దాపురం పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో కొంతమంది అక్రమంగా భవనాలు నిర్మిస్తున్నారని, ఈ విషయంలో పట్టణ ప్రణాళికా విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అలాగే కొన్ని భవనాల సెల్లార్లలో షాపులను కూడా ఏర్పాటు చేయడం వల్ల వాహనాలు పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉండడం లేదని వాపోయారు. పార్కింగ్ కోసం స్థలాన్ని విడిచిపెట్టకుండా భవనాలు నిర్మిస్తుంటే ప్రణాళికా విభాగం పట్టించుకోవడం లేదని, భవనాల ప్లాన్లు మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. అలాగే అనధికార లేఅవుట్లు వెలిశాయని, వాటికి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా విక్రయాలు సాగిస్తున్నారని తెలిపారు. అలాగే పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం పనిచేయడం లేదని, దీంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు.







