UPDATED 2nd OCTOBER 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: శాంతి, అహింస ఆయుధాలుగా భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడంలో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ ప్రపంచ దేశాలకు ఆదర్శమని మున్సిపల్ చైర్ పర్సన్ మన్యం పద్మావతి అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని మంగళవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గాంధీ నిరాడంబర, నిస్వార్థ జీవితాన్ని ఆయన ఆశయాలను భావితరాలకు తెలియజేయాలన్నారు. నేటి యువత, సమాజం బాపూజీ చూపిన అహింసా మార్గంలో నడవాలని, ఆయన కోరుకున్న భారతావనిని నిర్మించేందుకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చేందుకు బాపూజీ అహింసా మార్గాన్ని ఆయుధంగా ఎంచుకున్నారన్నారు. గాంధీ అడుగుజాడల్లో నడుచుకుంటూ, ఆయన చూపిన మార్గంలో పయనిస్తూ దేశాభివృద్ధికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఉద్యోగి నిబద్ధత, నిజాయితీ, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరరావు, కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ, బడుగు శ్రీకాంత్, జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, మున్సిపల్, మెప్మా సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







