UPDATED 25th OCTOBER 2022 TUESDAY 07:30 AM
Surya Grahan 2022: సూర్యుడు, చంద్రుడు, భూమి ఒక సరళరేఖలో వచ్చినప్పుడు ఖగోళంలో దృగ్విషయాన్ని సూర్యగ్రహణం అంటారు. అమావాస్యనాడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. మంగళవారం ఏర్పడే ఈ సూర్యగ్రహణం సాయంత్రం 4.29 గంటలకు ప్రారంభమై 6.26 గంటలకు ముగుస్తుంది. దృక్ సిద్ధాంత గణితం ఆధారంగా ఆశ్వయుజ మాసం బహుళ పక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే, మన దగ్గర పాక్షిక సూర్య గ్రహణం ఏర్పడనుంది.
సూర్యగ్రహణం ఏర్పడే సమయాల్లో ప్రాంతాలను బట్టి సమయాల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. సూర్య గ్రహణం స్వాతి నక్షత్రం నందు సంభవించడం వల్ల తులరాశి వారు ఈ గ్రహణం చూడకుండా ఉండటమే మంచిదని పలువురు పండితులు చెబుతున్నారు. ఈ గ్రహణం సింహ, వృషభ, మకర, ధనుస్సు రాశుల వారికి శుభ ఫలితాలనిస్తుంది. కన్య, మేషం, కుంభం, మిథునం రాశులకు మధ్యస్త ఫలితాలు ఉంటాయి. తుల, కర్కాటక, మీన, వృశ్చిక రాశుల వారికి అశుభ ఫలితాలు ఉంటాయని పలువురు పండితులు పేర్కొంటున్నారు.
సూర్యగ్రహణ సమయంలో సూర్య ఆరాధన, రాహు జపం, దుర్గాదేవి ఆరాధణ చేయడం వల్ల శుభ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు సూర్య గ్రహణం సాయంత్రం వేళ ఏర్పడుతుండటంతో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ఆహార నియమాలు పాటిస్తే మంచిదని పండితులు పేర్కొంటున్నారు.
సూర్యగ్రహణం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాన్నింటిని మూసివేయనున్నారు. గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంను ఉదయం 8.11 నుంచి రాత్రి 7.30 వరకు ఆలయం మూసివేస్తారు. ఆ సమయంలో అన్ని రకాల దర్శనాలను రద్దు చేశారు. సూర్యగ్రహణం పూర్తయిన తరువాత ఆలయ శుద్ధి అనంతరం కేవలం సర్వదర్శనం భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. ఇంద్రకీలాద్రిపై దుర్గగుడి ఆలయం మూసివేస్తారు. ఇదిలాఉంటే.. ఈ పాక్షిక సూర్యగ్రహణం 27 ఏళ్ల తర్వాత ఏర్పడనుంది. 2025 లోనూ పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడనున్నా, అది భారత్ లో కనిపించదు. మళ్లీ భారత్ లో పాక్షిక సూర్యగ్రహణం వీక్షించాలంటే 2032 వరకు ఆగాల్సి ఉంటుంది. హైదరాబాద్ లో ఈ పాక్షిక సూర్యగ్రహణం సాయంత్రం 4.59 గంటలకు కనిపించనుంది.







