UPDATED 8th SEPTEMBER 2017 FRIDAY 7:00 PM
గండేపల్లి: కృషి, పట్టుదలతోనే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని కేరళ హైకోర్ట్ జడ్జి డి. శేషాద్రినాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య బిజినెస్ స్కూల్లో ఫోరెన్సిక్ సైన్స్ అంశంపై నిర్వహించిన సెమినార్ కు ఆయన ముఖ్య అతిధిగా హాజరై శుక్రవారం మాట్లాడారు. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో పాటు ఆలోచనాధోరణి, ప్రశ్నించే తత్త్వం, మంచి లక్షణాలు కలిగి ఉండాలని, విషయాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస, ఉత్సుకత అలవరచుకోవాలన్నారు. చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కళాశాల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత ఆదిత్యలో మాత్రమే ప్రారంభించిన ఫోరెన్సిక్ సైన్స్ డిగ్రీ కళాశాలకు శేషాద్రినాయుడు ముఖ్య అతిధిగా హాజరుకావడం తమకు ఎంతో ఆనందం కలిగించిందన్నారు. సామాన్య స్థాయి నుంచి స్వయంకృషితో ఉన్నత శిఖరాలకు ఎదిగిన గొప్ప వ్యక్తి శేషాద్రి నాయుడని ప్రశంశలతో ముంచెత్తారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది కె. శ్రీనివాసరెడ్డి, బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, ఫోరెన్సిక్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇ.మోహన్, అధ్యాపకులు, తదితరులు పాల్గొన్నారు.







