UPDATED 23rd OCTOBER 2020 FRIDAY 6:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్-19 నిబంధనలు పాటించని షాపులను మూసివేసినట్లు ఆర్డీవో ఎస్. మల్లిబాబు పేర్కొన్నారు. పెద్దాపురం మెయిన్ రోడ్డులో గల షాపులను ఆర్డీవో మున్సిపల్ కమీషనర్ జె. సురేంద్రతో కలిసి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో నో మాస్క్--నో ఎంట్రీ బ్యానర్, శానిటైజర్ అందుబాటులో లేని 50 శాతం షాపులను మూసివేశారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ కరోనా కేసులు తగ్గుతున్న దశకు చేరుకొన్నప్పటికీ ప్రజల్లో మరింత అవగాహన పెంచాలని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచణ రూపొందించిందని అన్నారు. ఈనెల 21 నుంచి 30వ తేదీ వరకు పది రోజుల పాటు కోవిడ్-19 నియంత్రణపై అవగాహనా కార్యక్రమాలు డివిజన్ అంతా జరుగుతున్నట్లు తెలిపారు. కోవిడ్ హెచ్చరికల ద్వారా ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రజలు తమ ఆరోగ్య పరిరక్షణలో భాగంగా కోవిడ్ నియంత్రణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ నాగేశ్వరరావు, శానిటరీ ఇనస్పెక్టర్ దావీదురాజు, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







