UPDATED 8th AUGUST 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: బిడ్డ పుట్టిన గంటలోపే తల్లిపాలు పట్టిస్తే బిడ్డలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని, తల్లిపాలు పట్టిస్తే బిడ్డతో పాటు తల్లి ఆరోగ్యం బాగుంటుందని ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ పి. చంద్రరావు అన్నారు. తల్లిపాల వారోత్సవాలు ముగింపు సందర్భంగా స్థానిక లయన్స్ క్లబ్ ఆవరణలో సిడిపివో టి.డి.ఆర్. పద్మావతి అధ్యక్షతన ప్రాజెక్ట్ స్థాయి సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిసిఎస్ మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంట లోపే తల్లి పాలివ్వాలని దాని వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, పూర్తి ఆరోగ్యవంతంగా ఉంటుందన్నారు. బిడ్డకు తల్లి పాలు కల్తీలేని శ్రేష్టమైన ఆహారమని, బిడ్డ పుట్టిన ఆరునెలల వరకూ తప్పనిసరిగా తల్లిపాలివ్వాలన్నారు. తల్లిపాల వలన బిడ్డకు న్యూట్రీషియన్ ఆహారం అందటంతో పాటు బిడ్డ ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. తల్లులు కూడా ప్రొటీన్ ఆహారం తీసుకోవాలని దాని వలన పాలు అధికంగా ఉత్పత్తి అయి బిడ్డకు అవసరమైన పాలు ఇవ్వటానికి అవకాశముంటుందన్నారు. బిడ్డకు నాల్గవ నెల నుంచి అరటిపండు, ఉడకబెట్టిన క్యారెట్, బంగాళాదుంపలు వంటి సప్లిమెంటరీ ఆహారాన్ని అందించాలన్నారు. తల్లీ బిడ్డా అరోగ్యంగా ఉండాలంటే తల్లులు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలన్నారు. తల్లి పాలు బిడ్డకు విలువైన సంపదని అది ప్రతీ బిడ్డకూ అందాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. లక్ష్మి, ఎ.ఆర్. సుబ్రహ్మణ్యం, డాక్టర్ కోటేశ్వరమ్మ, జిల్లా మానవ హక్కుల పరిరక్షణా సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ, ఎం.ఎస్. నళిని, ఎ. మంగ, సుందరి, జ్యోతి, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.







