UPDATED 14th DECEMBER 2017 THURSDAY 9:30 PM
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమీషన్ రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేయడంపై మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుష్మితా దేవ్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అమరేంద్ర సింగ్ రాజా ఆధ్వర్యంలో స్థానిక పటేల్ చౌక్ ఎన్నికల కమిషన్ కార్యాలయాన్ని మహిళా కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో ఏపి మహిళా కాంగ్రెస్ బృందం ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ నేతలను ఆరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మాట్లాడుతూ గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యమని, ప్రజాదరణ చూడలేక బిజెపి, ఎన్నికల కమీషన్ కుమ్మక్కై కుట్రపూరితంగా మచ్చలేని నాయకుడు రాహుల్ గాంధీ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారమంతా దేశ ప్రజలు గమనిస్తున్నారని, గుజరాత్ ప్రజలు తమ ఓటు ద్వారా బిజెపికి బుద్ధి చెబుతారని పద్మశ్రీ హెచ్చరించారు. ఇలాంటి దుశ్చర్యలు వల్ల కాంగ్రెస్ పార్టీ పై రోజురోజుకూ మరింత ఆదరణ పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిట్రగుంట మల్లిక, సావిత్రి, సింధూజ, లీలా, భారతి, శ్రీలక్ష్మి, కురిషిదా, అమర్ జహ్ బేగ్, సుభాషిణి, మౌనిక, లక్ష్మీ, ఉదయశ్రీ, ఇకుల భాగ్యలక్ష్మి, సుజాతరెడ్డి, అభిదా తదితరులు పాల్గొన్నారు.







