UPDATED 17th NOVEMBER 2022 THURSDAY 10:40 AM
Hardik Pandya: ‘టీమిండియా సొంత గడ్డపై 2011 వన్డే ప్రపంచ కప్ గెలిచిన తర్వాతి నుంచి ఇప్పటివరకు సాధించింది ఏమీ లేదు’ అంటూ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ చేసిన విమర్శలకు భారత ఆటగాడు హార్దిక్ పాండ్యా దీటుగా స్పందించాడు. టీమిండియా తనను తాను నిరూపించుకునే అవసరం ఏమీ లేదని అన్నాడు. ఆటతీరు సరిగా లేనప్పుడు చాలా ఎన్నో రకాల అభిప్రాయాలు తెలుపుతుంటారని, ఇందులో తప్పు లేదని చెప్పాడు. వారి అభిప్రాయాలను తాము గౌరవిస్తామని అన్నాడు.
అంతర్జాతీయ స్థాయిలో ఇప్పుడు తాము కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదని హార్దిక్ పాండ్యా తెలిపాడు. క్రీడల్లో బాగా రాణించేందుకు ప్రయత్నిస్తూనే ఉండాలని, అందాల్సిన ఫలితం అందుతుందని చెప్పాడు. పలు అంశాలపై తాము దృష్టి పెట్టి, పొరపాట్లను సరిదిద్దుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నాడు.
కాగా, ఆసియా కప్ లో ఓటమిని మరవక ముందే, టీ20 ప్రపంచ కప్ లోనూ టీమిండియా ఓడిపోయి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. రేపటి నుంచి న్యూజిలాండ్ తో టీమిండియా టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 సిరీస్ లో హార్దిక్ పాండ్యా టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్ లో ఆడకుండా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కు విశ్రాంతి ఇచ్చారు.







