UPDATED 15th NOVEMBER 2017 WEDNESDAY 8:00 PM
కాకినాడ : రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపిన సంక్షేమ పథకాలు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక కలెక్టరేట్ వద్ద న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. జిల్లా న్యాయవాదుల సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కాకినాడ కోర్ట్ కాంప్లెక్స్ నుంచి కలెక్టరేట్ వరకూ ప్రదర్శన నిర్వహించి, ఆందోళన చేపట్టారు. న్యాయవాదులకు మెడికల్ రీఎంబర్స్మెంట్ రూ.2 లక్షలు ఇవ్వాలని, ఆరోగ్య కార్డులు జారీ చేయాలని, నోటరీ రెన్యువల్స్ పునరుద్ధరించాలని, డెత్ బెనిఫిట్స్ రూ.10 లక్షలు ఇవ్వాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటిపై సీఎం, న్యాయశాఖా మంత్రి, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో 25 వేల మంది న్యాయవాదులకు జర్నలిస్టుల మాదిరి ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ.150 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.ఐదు వేలు స్టైఫండ్ మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ న్యాయవాదులకు ఇస్తున్న స్టైఫండ్ రూ.3 వేలకు పెంచాలని, ఇళ్ళ స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెల్ఫేర్ స్టాంపుల రూపేణా ఇవ్వాల్సిన బకాయిలు న్యాయవాదుల సంక్షేమ నిధికి జమ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు రాజేష్, న్యాయవాదులు పాల్గొన్నారు.







