UPDATED 4th JULY 2019 THURSDAY 6:30 PM
పెద్దాపురం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం నేటి యువతకు ఆదర్శనీయమని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు 122వ జయంతిని పురస్కరించుకుని గురువారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ మన్యం ప్రాంతంలో గిరిజనులపై బ్రిటీషువారి ఆగడాలను చూసి సహించలేక అల్లూరి సీతారామరాజు ఉద్యమ బాటపట్టారని, గిరిజనులను ఏకంచేసి, బ్రిటీషు సైన్యాన్ని గడగడలాడించారని చెప్పారు. యువత అల్లూరి ధైర్య సాహసాలను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయం ఏవో నాంచారయ్య, డిప్యూటీ తహసీల్దార్లు భానుప్రసాద్, రాంకుమార్, టైపిస్టులు ప్రకాష్, శాంతిశ్రీ, రాధ, సూరిబాబు, బాబ్జి, గణపతి,తదితరులు పాల్గొన్నారు.







