Updated 23rd December 2022 Friday 10:00 pm
Wear masks: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో అందరూ మాస్కులు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి కొవిడ్-19 విషయమై కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొవిడ్ ఉల్లంఘణల నడుమ జోడో యాత్ర సాగుతోందని, రాహుల్ కొవిడ్ వ్యాప్తికి కారణమవుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే భారత్ జోడో యాత్రకు వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక కేంద్రం కొవిడ్ నాటకం ఆడుతోందని కాంగ్రెస్ నేతలు తిప్పి కొట్టారు. అయితే ఎట్టకేలకు కేంద్రం ఆదేశాలకు కాంగ్రెస్ తలొగ్గినట్లే కనిపిస్తోంది. యాత్ర ఢిల్లీకి చేరుకునే లోపు అందరికీ మాస్కులు ఉండాలని పార్టీ ఆదేశాలు జారీ చేసింది.
ఇక కొవిడ్ పేరుతో భారత్ జోడో యాత్రను అడ్డుకోవాలని కేంద్ర ప్రయత్నిస్తోందని, రాహుల్ యాత్రకు వస్తున్న ఆదరణను చూసి కమల నేతల్లో వణుకు పుట్టిందంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను బీజేపీ కొట్ట పారేసింది. భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోందని, అలాంటి పార్టీని తాము లెక్కలోకే తీసుకోవడం లేదంటూ బీజేపీ కౌంటర్ అటాక్ చేసింది.







