UPDATED 11th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని మండల విద్యా శాఖాధికారిణి సజ్జా విజయలక్ష్మీదేవి పేర్కొన్నారు. స్థానిక మండల విద్యాశాఖ కార్యాలయంలో విద్యార్థుల ఆరోగ్య పరీక్షలపై ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో బుధవారం మధ్యాహ్నం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో విజయలక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలుతున్నందున పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, పిల్లలందరికీ హిమోగ్లోబిన్, దంత, కంటి పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ర్యాలీలు నిర్వహించి అవగాహన కల్పించాలని అన్నారు. ఎస్ఎస్ఏ సిఎంవో వెంకట్రావు మాట్లాడుతూ ప్రతీ పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేసిందని, ఈనెల 27వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. అలాగే ఈ ఎన్నికల విధి విధానాలకు చెందిన యాప్ ప్రభుత్వం రూపొందించిందని, ప్రధానోపాధ్యాయులు ఆ యాప్ డౌన్ లోడ్ చేసుకుని మీటింగ్ వివరాలను అందులో నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో అర్బన్, మండల పరిధిలోని ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.







