UPDATED 23rd AUGUST 2018 THURSDAY 9:00 PM
సామర్లకోట: గుండెల నిండా ఉప్పొంగిన దేశభక్తితో తెల్లదొరల పాలిట సింహస్వప్నంగా నిలిచి, దేశపౌరుల్లో స్వాతంత్య్రాభిలాషను ఇనుమడింపజేసిన భరతమాత ముద్దుబిడ్డ ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు అని ప్రిన్సిపాల్ శారదాదేవి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు 146వ జయంతిని పురస్కరించుకుని గురువారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపాల్ శారదాదేవి మాట్లాడుతూ ప్రకాశం పంతులు నీతి, నిజాయితీలకు నిదర్శనమని, ఉత్తమ రాజకీయ విలువలు పాటించిన అరుదైన వ్యక్తి అని కొనియాడారు. దేశం కోసం ప్రాణాలర్పించేందుకు కూడా వెనుకాడని టంగుటూరి ప్రకాశం పంతులను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని, బ్రిటీష్ ప్రభుత్వానికి ఎదురునిలిచి సైమన్ కమీషన్ గోబ్యాక్ అని నినదించిన ధైర్యశాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేడ్ ఎ లైబ్రేరియన్ శాంతిశ్రీ, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







