* జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ
UPDATED 10th DECEMBER 2019 TUESDAY 5:30 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): జిల్లాలో గల అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ప్రతీ నెల 6,7 తేదీలలో నాణ్యమైన సరుకులను సరఫరా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో ఐసిడిఎస్, సివిల్ సప్లయ్ అధికారులతో జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు తూకంలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని అన్నారు. రేషన్ షాపుల తనిఖీ సమయంలో సీజ్ చేసిన సరుకులను దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి తరలించాలని, దీనిని డిప్యూటీ తహసీల్దార్, గ్రామ రెవెన్యూ అధికారి పర్యవేక్షించాలని అన్నారు. రేషన్ షాపుల డీలర్లు వేలిముద్రలు లేకుండా సరుకులు పంపిణీ చేయడం, వేలిముద్రలు వేసిన వారికి సరుకులు పంపిణీ చేయకపోవడం నిరోధించాలని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. సుఖజీవస్ బాబు, జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రసాదరావు, డిఎం రాంబాబు, జిల్లా ఇన్ఫర్మేషన్ అధికారి సుబ్బారావు, సిడిపివోలు సావిత్రి, కనకదుర్గ, జిల్లా రేషన్ దుకాణాల అధ్యక్షుడు పల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.







