UPDATED 23rd DECEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా వేకువ జామునుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరడంతో భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, మహంకాళి వెంకటగణేష్, బాడితమాని త్రిమూర్తులు, ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు, దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







