UPDATED 18th MARCH 2022 FRIDAY 04:00 PM
Anthrax in Animals: దేశంలో మరోసారి ఆంత్రాక్స్ వైరస్ కలకలం రేగింది. ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో ఆంత్రాక్స్ సోకి జింక మృతి చెందడం సంచలనంగా మారింది. ఐఐటీ-మద్రాస్ క్యాంపస్లో ఆంత్రాక్స్తో ఒక జింక మరణించింది.. గుంపులో ఉన్న మరో మూడు జింకలు కూడా ఈ ప్రమాదకర వైరస్ భారిన పడినట్లు పశువైద్యులు ధ్రువీకరించారు.
ఆంత్రాక్స్ సోకిన నాలుగు జంతువులలో ఇటీవల ముక్కు నోటి ద్వారా రక్తం, నురగలు బయటకు వచ్చాయి. క్యాంపస్ లో జింక కళేబరాన్ని గుర్తించిన ఐఐటీ-మద్రాస్ భద్రతా సిబ్బంది..గిండీ నేషనల్ పార్క్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న జాతీయ జంతు సంరక్షణ అధికారులు.. జింక కళేబరం ఉన్న ప్రాంతంలో ఆంక్షలు విధించారు.
క్యాంపస్ లోని విద్యార్థులు, ఇతర సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు.జింకలను పరిశీలించేందుకు వెళ్లిన పశువైద్యాధికారి ఆంత్రాక్స్తో జింక మృతి చెందినట్లు అనుమానించి నమూనాలు సేకరించారు. జింకల నమూనాలను పరీక్షల నిమిత్తం తమిళనాడు వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీకి పంపించారు. మృతి చెందిన జింక కళేభరంలో నమూనాలు ఆంత్రాక్స్ ఉన్నట్లు నిర్ధారించగా మిగిలిన వాటి నుండి సేకరించిన నమూనాలపై పరీక్షలు కొనసాగుతున్నాయి.
మృతి చెందిన జింక కళేబరాన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ప్రకారం ఖననం చేసినట్లు ఐఐటీ-మద్రాస్ తెలిపింది.చెన్నై వంటి మహానగరంలో అందులోనూ ఐఐటీ క్యాంపస్ లో ఆంత్రాక్స్ బయటపడడం దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. క్యాంపస్ లో పదుల సంఖ్యలో వీధి కుక్కలు ఉన్నాయని, కుక్కల నుండి ఆంత్రాక్స్ జింకలకు వ్యాపించి ఉండవచ్చని పశువైద్యులు చెబుతున్నారు.
క్యాంపస్లో విద్యార్థులు వీధికుక్కల దగ్గరికి వెళ్లవద్దని, వాటిని తాకవద్దని ఐఐటీ-మద్రాస్ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చామని అటవీశాఖ అధికారి ఒకరు తెలిపారు.ఐఐటీ మద్రాస్ క్యాంపస్ లో ఆంత్రాక్స్ వైరస్ బయటపడిన నేపథ్యంలో పక్కనే ఉన్న గిండీ చిల్డ్రన్స్ పార్క్లో హై అలర్ట్ ప్రకటించారు.
చేతులకు తొడుగులు లేకుండా జూ సిబ్బంది అనవసరంగా ఆహారం లేదా జంతువులను తాకవద్దని ఆదేశించారు. మరోవైపు కోయంబత్తూరు డివిజన్లోని తడగంలోనూ ఆంత్రాక్స్తో మగ ఏనుగు మృతి చెందింది. దీంతో రాష్ట్రంలో ఆంత్రాక్స్ వ్యాప్తిపై మరింత ఆందోళన వ్యక్తం అవుతుంది.







