UPDATED 17th JULY 2018 TUESDAY 8:00 PM
పెద్దాపురం: ప్రతీ విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉండి, తోటి విద్యార్థినీ, విద్యార్థులతో సోదర, సోదరీ భావాన్ని పెంచుకోవాలని ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. స్థానిక జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యార్థుల మధ్య చెలరేగిన వివాదంపై జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు మంగళవారం ఆర్డీవో పాఠశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతీ విద్యార్థి కష్టపడి విద్యను అభ్యసించి ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యాలు కలిగినా ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకురావాలే తప్ప సొంత నిర్ణయాలు తీసుకోకూడదని అన్నారు. ప్రతీ విద్యార్థి మొక్కలను పెంచే అలవాటు నేర్చుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నవోదయ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. మునిరామయ్య, వైస్ ప్రిన్సిపాల్ డి.వి. రమణ, డిప్యూటీ తహసీల్దార్ టి.ఎ. కృష్ణారావు, ఎస్ఐ ఎ. కృష్ణభగవాన్, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.







