UPDATED 8th JANUARY 2019 TUESDAY 9:00 PM
సామర్లకోట: ఆడపిల్లలు చదువుకునే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ఆడపిల్లల చదువులు ఇంటికి వెలుగని సిడిపివో పద్మావతి అన్నారు. స్థానిక అయోధ్యరామపురంలో గల మున్సిపల్ ఉన్నత పాఠశాలలో రెండవ విడత కిశోర బాలికా వికాసం కార్యక్రమంలో భాగంగా మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ మాట్లాడుతూ బాల్యం నుంచే ఆడపిల్లలను చదువు పట్ల, సమాజం పట్ల మంచి అవగాహన ఉండేటట్లు చూడాలని, తెలిసీ తెలియని వయసులో ప్రవేశిస్తున్న టీనేజ్ పిల్లలకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. బాలల అభివృద్ధికి ప్రభుత్వం కల్పిస్తున్న పలు కార్యక్రమాలను ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె. అరుణ, ఏ.ఎల్.వి. కుమారి, జి. గోవిందు, తాళ్లూరి వైకుంఠం, వైఆర్ఎల్ డిగ్రీ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.







