UPDATED 20th SEPTEMBER 2018 THURSDAY 6:30 PM
రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( గైట్) అటానమస్ కళాశాల మెకానికల్ విభాగం ఆధ్వర్యంలో ఆనకట్ట వివిధ మూలకాల పరిమిత మూలకం మోడలింగ్, విశ్లేషణ అనే అంశంపై సెమినార్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నీటి పారుదల శాఖ ఎఇఇ సరిదే అన్వేష్ మాట్లాడుతూ పోలవరం వంటి ఆనకట్టలను తక్కువ వ్యవధిలో, ఎక్కువ మన్నికతో సమతుల్య వ్యయంతో నిర్మించడానికి ఎఫ్ఇఎం టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఎఫ్ఇఎం కారణంగా రిజర్వాయర్ నిర్మాణం నాణ్యతతో జరగడంతో పాటు ప్రాజెక్ట్ ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుందని అన్నారు. ఒక ఆనకట్ట డిజైన్ ను కంప్యూటర్లో చేసే సమయంలోనే దాని స్థితిగతులు పరిశీలిస్తామన్నారు. ఆనకట్ట డిజైన్, రేడియల్ గేట్లు విశ్లేషణ వివరించారు. ఎఫ్ఇఎం పద్ధతి వల్ల రిజర్వాయర్లు దిగువ భాగం దృఢంగా ఉంటుందని అన్నారు. గైట్ అకాడమిక్ డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. పరిశ్రమలు కోరుకునే విధంగా తమ కళాశాల విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునేందుకు దోహదపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి కె. సుబ్బారావు, మెకానికల్, సివిల్ విభాగ అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







