Fuel Prices Hike : మళ్లీ పెరగనున్న పెట్రోల్ ధర? లీటర్ పై రూ.12 పెంపు?

UPDATED 17th MARCH 2022 THURSDAY 12:50 AM

Fuel Prices Hike : పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయా? రేపో మాపో ధరలు పెరగొచ్చా? లీటర్ పై రూ.12వరకు పెరగనుందా? ఇప్పుడీ భయాలు వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. రష్యా-యుక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు సరికొత్త రికార్డులు నమోదుచేసింది. దీంతో అంతర్జాతీయంగా పెట్రోల్‌, డీజీల్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. భారత్‌లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో ఇంధన ధరల పెంపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్థిరంగానే కొనసాగాయి (Fuel Prices Hike).

రష్యా యుక్రెయిన్‌ వార్‌ నేపథ్యంలో బ్యారెల్‌ క్రూడాయిల్‌ ధర సుమారు 80 డాలర్ల నుంచి 130 డాలర్లకు పెరిగింది. ఎన్నికల ఫలితాల తర్వాత.. ఇంధన రిటైలర్లు ధరలను సర్దుబాటు చేస్తారని అంచనా వేశారు. ఇంధన ధరలు ఏకంగా రూ. 12 పెరిగే ఛాన్స్‌ ఉందంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పెట్రోల్ ధరలు మారలేదు. అయితే, ఈ శుక్రవారం లేదా శనివారం రోజున పెట్రోల్ ధరల పెంపునకు సంబంధించిన ప్రకటన రావొచ్చని సంబంధిత వర్గాల చెబుతున్నాయి.

కాగా ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుక్షణమే ఇంధన ధరలు భారీగా పెరుగుతాయనే వార్తలు రావడంతో వాహనదారులు అలర్ట్ అయ్యారు. పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. తమ వాహనాల్లో ఫుల్‌ ట్యాంక్‌ చేసుకున్నారు. మార్చి నెల తొలి పదేహేను రోజుల్లో రికార్డు స్థాయిలో పెట్రోల్‌, డీజిల్‌ను వాహనాల్లో నింపుకున్నారు. (Petrol Diesel Price)

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుదల భయంతోనే వినియోగదారులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు జరిపినట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరీ తెలిపారు. ఇలా ముందస్తుగా వాహన ట్యాంకులను నింపుకోవడంతో పెట్రోల్‌, డీజిల్‌ వినియోగం ఒక్కసారిగా 20 శాతం పెరిగిందన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ చేసిన ప్రకటనను కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

‘ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్‌ ధరలు పెరగనున్నాయ్‌.. అందుకే ఇప్పుడే మీ వాహన ట్యాంకులను నింపుకోండి’ అని మార్చి 5న రాహుల్‌ గాంధీ చెప్పడం వల్లే 20 శాతం వినియోగం పెరిగిందని పెట్రోలియంశాఖ మంత్రి ఆరోపించారు. అంతేకాకుండా త్వరలోనే ఎలక్షన్‌ ఆఫర్‌ ముగుస్తుందని రాజకీయ నాయకులు ప్రచారం చేయడం సిగ్గుచేటని కేంద్రమంత్రి విమర్శించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమీపించిన దగ్గర నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలకు కళ్లెం పడింది. అంతకుముందు రోజువారీగా పెరుగుతూ రికార్డు స్థాయికి వెళ్లిన ఇంధన ధరలు.. దాదాపు 132 రోజుల పాటు పెరగలేదు. క్రూడాయిల్‌ ధర పెరిగినప్పటికీ వీటిని పెంచకపోవడం గమనార్హం. అయితే, ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే ఇంధన ధరల్లో దాదాపు రూ.12 పెరగవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి.(Fuel Prices Hike)

కాగా, చమురు ధరలు గరిష్ఠ స్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 4, 2021న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటర్‌కు రూ.5, డీజిల్‌పై రూ.10 చొప్పున సుంకాన్ని తగ్గించడంతో ఇంధన ధరలు గణనీయంగా తగ్గాయి. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఇతర రాష్ట్రాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్‌ని తగ్గించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన మరుక్షణమే కేంద్రం ఇంధన ధరలను పెంచుతుందని చెప్పాయి.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us