UPDATED 25th SEPTEMBER 2022 SUNDAY 09:15 PM
Mukul Rohatgi: ప్రభుత్వం ఇచ్చిన భారత అటార్నీ జనరల్ పదవి ఆఫర్ను సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గి తిరస్కరించారు. గతంలో ఒకసారి భారత అటార్నీ జనరల్గా పని చేసిన ఆయన.. మరోసారి ఆ పదవిని చేపట్టనున్నట్లు గుసగుసలు వినిపించాయి. అయితే వాటికి తెర దించుతూ మరోసారి ఆ పదవి చేపట్టడానికి తాను ఆసక్తిగా లేనని ఆదివారం ప్రకటించారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆఫర్ను కాదనడం వెనుక ఎలాంటి ప్రత్యేకమైన కారణమేమీ లేదని, మరోసారి ఆ పదవిని చేపట్టేందుకు తాను సముఖంగా లేనని స్పష్టం చేశారు.
అక్టోబర్ 1 నుంచే ముకుల్ రోహత్గి అటార్నీ జనరల్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది. ఈ మేరకు కేంద్రం పూర్తి స్థాయిలో సన్నాహాలు చేసినట్లు కూడా అనేక వాదనలు వినిపించాయి. అయితే తాజాగా వాటికి బ్రేక్ వేస్తూ అందుకు తాను సముఖంగా లేనని చెప్పడం గమనార్హం. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్ ఐదేండ్ల పాటు కేంద్ర ప్రభుత్వ ఉన్నత న్యాయవాదిగా వ్యవహరించారు. ఆయన వయసు రీత్యా తనకు విరమణ ఇవ్వాలని ఆయన గతంలోనే కోరారు. ఇందుకు అనుగుణంగా సెప్టెంబర్ 30న రిటైర్మెంట్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి రోహత్గీ అత్యంత సన్నిహితుడు. 2014లో అత్యున్నత న్యాయ అధికారిగా నియమితులయ్యారు. ప్రభుత్వ వైఖరిని అసమ్మతి వ్యక్తం చేస్తూ 2017 జూన్ రెండో వారంలో ఏజీ పదవికి రోహత్గీ రాజీనామా చేశారు. అనంతరం తన న్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు.







