కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడి
ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 6 జనవరి 2022 : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనలో చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరాలు సేకరిస్తోందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. వాటికి అనుగుణంగా కఠిన నిర్ణయాలు తీసుకునే యోచనలో ఉందన్నారు. ప్రధాని అధ్యక్షతన నేడు జరిగిన కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించిన ఆయన.. ఇప్పటికే ప్రధాని భద్రతా వ్యవహారంపై కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారని గుర్తుచేశారు. ‘న్యాయవ్యవస్థ దేశంలోని ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తుందనే విశ్వాసం నాకుంది. అటువంటి తప్పిదాలు జరిగినప్పుడు ఎటువంటి చర్యలు అవసరమో అవి తీసుకోవాలి. భద్రతా వైఫల్యంపై చర్యలు తీసుకునేందుకు హోంమంత్రిత్వ శాఖ ఇప్పటికే సన్నద్ధమైంది. పూర్తి సమాచారం సేకరించిన తర్వాత భారీ, కఠిన చర్యలు తీసుకుంటుంది’ అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్, ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీలు భేటీ అయ్యాయి. ఇదే సమయంలో భద్రతపై ఏర్పాటు చేసిన కేబినెట్ కమిటీతోనూ ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అంతకుముందు, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తోనూ ప్రధాని భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న రాష్ట్రపతి.. భద్రతా వైఫల్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.







