UPDATED 27th SEPTEMBER 2017 WEDNESDAY 10:00 PM
రాజమహేంద్రవరం : రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ‘గోదావరి డ్యాన్స్ అండ్ లైట్స్’ పేరుతో దసరా పండుగ సందర్భంగా ప్రత్యేక సంగీత, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్థానిక కోటిలింగాల ఘాట్ వద్ద రెండు రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలు సంప్రదాయ సంగీత నృత్యాలు, సంప్రదాయ వాయిద్యాలతో స్వాగతం పలుకుతూ ఈ వేడుకలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ముందుగా గోదావరి మాతకు వేదపండితులు హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుతం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఇక నుంచి ప్రతీ సంవత్సరం ఇక్కడ వేడుకలు నిర్వహించనున్నట్టు తెలిపారు. గోదావరి పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇక్కడి వనరులను పరిశీలించి, ఈ ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. గోదావరి నదిని ఆనుకుని ఉన్న ప్రాంతాలను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని, గోదావరి తీరాన ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం రాజమహేంద్రవరంకు చెందిన చిన్నారి హరిణిప్రియ సంప్రదాయ నృత్యం, గాయత్రీ నృత్యకళానికేతన్, పద్మశ్రీ డాక్టర్ ఆనంద్ శంకర్ జయంతి బృందం, మధురిమ బృందం ప్రదర్శించిన నృత్యరూపకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే శివమణి డ్రమ్స్, సినీగాయకులు సింహా, రమ్య, బెరహా, శ్రీరామ్, భవ్య, సత్యశ్రీలు ఆలపించిన గీతాలు యువతను ఉర్రూతలూగించాయి. ఈ కార్యక్రమంలో నగర మేయర్ పంతం రజనీశేషసాయి, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సోమువీర్రాజు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జాయింట్ కలెక్టర్ -1 మల్లిఖార్జున, జాయింట్ కలెక్టర్ -2 జె. రాధాకృష్ణమూర్తి, అర్బన్ ఎస్పీ రాజకుమారి, ఇన్ఛార్జి సబ్కలెక్టర్ విజయ్రామరాజు, తదితరులు పాల్గొన్నారు.







