UPDATED 12 MARCH 2022 SATURDAY 08:00 AM
Amit Shah: దేశంలోని 99% పోలీస్ స్టేషన్ల డేటాబేస్ లను ఇప్పటికే ఇంటిగ్రేట్ చేసిన క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టమ్స్ (సిసిటిఎన్ఎస్)లో సిబిఐ, ఎన్ఐఏ, ఎన్సీబీ వంటి కేంద్ర పోలీసు సంస్థలు చేరాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సిఆర్ బి) 37వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలలో శుక్రవారం అమిత్ షా పాల్గొన్నారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ శిక్షాస్మృతిలోని నిబంధనల ప్రకారం నేర డేటాను అనుసంధానించడం మరియు విశ్లేషించడం మాత్రమే కాకుండా, నేరాన్ని ప్రేరేపించే సామాజిక కారకాలపై మరింత లోతుగా దృష్టిపెట్టాలని ఎన్సిఆర్ బికి పిలుపునిచ్చారు. క్రైమ్ డేటాను కూడా సేకరించి సామాజిక దృక్పథం ద్వారా చూస్తే, నేర నియంత్రణ ప్రణాళికలను మరింత మెరుగుపరుచుకోవచ్చని అమిత్ షా అన్నారు.
డేటా బేస్ తయారీ పై హోంమంత్రి అమిత్ షా మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. మొదటిది యాక్సెస్. డేటా బేస్ నుంచి వివరాలు వ్యవస్థలో కీలక విభాగాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. సరైన సమయంలో సరైన వ్యక్తి ఆయా డేటాను పొందే విధంగా యాక్సెస్ ఇవ్వాలి. రెండవది డేటా నిల్వ ఫార్మాట్, తద్వారా గరిష్ట డేటా నిల్వ చేయబడుతుంది. మూడవది డేటా విశ్లేషణ సాధనాలకు సంబంధించినది.
ఇది చాలా ఆధునికంగా ఉండాలని అమిత్ షా వివరించారు.దేశంలో పెద్ద విద్యా సంస్థలు మరియు కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్న ప్రదేశాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచాలని, వారి చుట్టూ జరుగుతున్న నేర కార్యకలాపాలను పర్యవేక్షించాలని హోంమంత్రి తెలిపారు.
“నేరాలను ఐపిసి దృక్పథం నుండి మాత్రమే చూడటం ద్వారా పరిష్కారాన్ని కనుగొనలేమన్న అమిత్ షా, దీనిని విడిగా విశ్లేషించాలని.. ఇది ఎన్ సిఆర్ బి మరియు బిపిఆర్ అండ్ డి విభాగాలు ఆ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని రాష్ట్రాలతో చర్చించిన తరువాత వర్క్ షాప్ లను ఏర్పాటు చేయాలని అమిత్ షా పేర్కొన్నారు.







