Updated 21st February 2023 Tuesday 7:20 am
Earthquake In Turkey : 15 రోజుల క్రితం నాటి విషాదం నుంచి టర్కీ ఇంకా తేరుకోనేలేదు. శిథిలాల తొలగింపు ప్రక్రియ ఇప్పటికీ ముగియనేలేదు. మృతుల సంఖ్యకు ఫుల్ స్టాప్ పడనేలేదు. సహాయం కోసం బాధితులు చేస్తున్న ఆర్తనాదాలు ఇంకా ఆగిపోనేలేదు. అంతలోనే భూకంప భూతం మళ్లీ వచ్చేసింది. ఆ దేశాన్ని హడలెత్తిస్తోంది. వదలబోనంటూ వరుస ప్రకంపనలతో భయపెడుతోంది.
ప్రకృతి ప్రకోపానికి టర్కీ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ భూకంపానికి గురైన భయం ఇంకా వీడకముందే మరోసారి ఆ దేశాన్ని భూకంపం వణికించింది. ఒకటి కాదు రెండు కాదు గంటల వ్యవధిలోనే 32 సార్లు భూమి కంపించింది. నిన్న రాత్రి మొదలైన ప్రకంపనలు కంటిన్యూగా కొనసాగుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు.
తాజా ప్రకంపనలకు మరో ముగ్గురు బలవ్వగా 213 మంది గాయాల పాలయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నిన్న రాత్రి 8 గంటలకు టర్కీ, సిరియా బార్డర్ లో మరోసారి భూప్రకంపనలు మొదలయ్యాయి. టర్కీలో హటే ప్రావిన్స్ లో మొదట 6.4 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత మరో మూడు నిమిషాల్లో మరోసారి భూకంపం వచ్చింది.
రెండో సారి భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. దీంతో భవనాలు ఊగిపోయాయి. కొన్ని భవనాలు నేల మట్టమయ్యాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. దీంతో మరోసారి రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ మొదలు పెట్టాయి. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.







